Lok Sabha | పార్లమెంట్ భద్రత వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరగాలని విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉభయ సభల్లో అధికార, విపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంటున్నది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో ఉభయ సభల నుంచి 141 ఎంపీలను సస్పెండ్ చేశారు.
ఓ వైపు పార్లమెంట్ కాంప్లెక్స్లో ప్రతిపక్షాలు ఓ వైపు ఆందోళనలు కొనసాగిస్తున్న తరుణంలో భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను సవరించేందుకు తీసుకువచ్చిన మూడు బిల్లులను మంగళవారం హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను భర్తీ చేసే మూడు సవరించిన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లులను గతవారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను హోంమంత్రి ఉపసంహరించుకున్నారు. కొన్ని మార్పులు చేయాల్సి ఉన్నందున బిల్లులను ఉపసంహరించుకుని మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బిల్లులను స్టాండింగ్ కమిటీ పరిశీలించిందని, అధికారిక సవరణలకు బదులు బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించామని చెప్పారు.
ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులను స్టాండింగ్ కమిటీకి పంపారు. మూడు బిల్లుల స్థానంలో కేంద్రం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య పేర్లతో చట్టాలను తీసుకువస్తున్నది. ఆయా బిల్లులపై చర్చ సందర్భంగా ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు.