Lok Sabha Elections : పశ్చిమబెంగాల్లోని విష్ణుపూర్ (Bishnupur) లోక్సభ నియోజకవర్గ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఆ నియోజకవర్గంలో మాజీ దంపతుల నడుమే ప్రధాన పోటీ నెలకొంది. అక్కడ బీజేపీ నుంచి సౌమిత్రా ఖాన్ (Saumitra Khan), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుజతా మోండల్ (Sujata Mondal) బరిలో దిగుతున్నారు. వీరిద్దరూ మాజీ దంపతులు. దాంతో విష్ణుపూర్ లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
సౌమిత్ర ఖాన్, సుజాత మోండల్ 2010లో వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో సౌమిత్రా ఖాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సుజాతా మోండల్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు సౌమిత్ర ఖాన్ బీజేపీలో చేరారు. దాంతో సౌమిత్రా ఖాన్ తరఫున ఆయన భార్య సుజాతా మోండల్ ప్రచారం కూడా చేశారు.
కానీ ఆ తర్వాత రెండేళ్లకే అంటే 2021లో సుజాతా మోండల్ తన భర్తకు అభీష్టానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోయిన సౌమిత్రా ఖాన్.. తాను సుజాతతో వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నానని మీడియా ముఖంగా ప్రకటించారు. అప్పటి నుంచి భార్యభర్తలు ఇద్దరూ విడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించారు. ముందుగా బీజేపీ విష్ణుపూర్ నుంచి సౌమిత్రా ఖాన్ను బరిలో దించగా.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుజాతా మోండల్ను ఆమె మాజీ భర్తపై పోటీకి పెట్టింది. దాంతో మాజీ భార్యభర్తలు తలపడుతున్న విష్ణుపూర్ లోక్సభ స్థానం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.