కోల్కతా, జనవరి 19: రాబోయే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకంపై ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. సీట్ల కేటాయింపులో తమకు తగిన ప్రాముఖ్యం ఇవ్వకపోతే రాష్ట్రంలోని 42 సీట్లలో పార్టీ సొంతంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ముర్షిదాబాద్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ జిల్లాలోని మూడు ఎంపీ సీట్లను గెల్చుకోవాలని మమత పిలుపునిచ్చారని పేరును వెల్లడించని ఒక టీఎంసీ నేత తెలిపారు. ఇండియా కూటమిలో టీఎంసీ ముఖ్యమైన పార్టీ అని, అయితే దానికి విరుద్ధంగా సీట్ల సర్దుబాటులో ఆర్ఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె ఆరోపించారన్నారు. అలాంటి పరిస్థితుల్లో తమ దారి తాము చూసుకుందామని, 42 సీట్లలో బరిలో దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె కోరినట్టు ఆ నేత తెలిపారు.