Lok Sabha Elections | న్యూఢిల్లీ, మార్చి 15: యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికలు-2024, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ‘జ్ఞాన్ భవన్’లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ ప్రకటించనున్నది. శుక్రవారం ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి ఒకరు సోషల్మీడియా ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా వెల్లడించారు. లోక్సభతో పాటు, ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనున్నది.
ఈసీ డాటా ప్రకారం..అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్-జూన్ 16వ తేదీతో, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాష్ర్టాల అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో పర్యటించిన ఈసీ..స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్త్రత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్ను సిద్ధం చేసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ‘మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి రానున్నది. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు.
సెలక్షన్ ప్యానల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించే 2023 చట్టం ప్రకారం కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్ల అపాయింట్మెంట్పై స్టే ఇవ్వటానికి సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. జస్టిస్ సంజీవ్ఖన్నా, దీపాంకర్ దత్తా, ఆగస్టన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. ఇద్దరు ఈసీల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను మార్చి 21కి ధర్మాసనం వాయిదా వేసింది. ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఏడీఆర్) తరుఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించటానికి ఎన్నికల కమిషన్ను రాజకీయ, కార్యనిర్వాహక జోక్యం నుంచి తప్పించాలని వాదిస్తూ ఎంపిక ప్యానెల్ నుండి సీజేఐని తప్పించటాన్ని సవాల్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సంధు గురువారం ఎన్నికల కమిషనర్లుగా గురువారం నియమితులు కావటం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
కొత్త ఎన్నికల కమిషన్ల ఎంపికపై వివాదం ఓ వైపు నడుస్తుండగానే శుక్రవారం జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీఈసీ రాజీవ్కుమార్తో వారిద్దరూ భేటీ అయ్యారు. వీరిద్దరిని గురువారం ప్రధాని మోదీ నేతృత్వంలోని సమావేశమైన కమిటీ ఎంపిక చేసింది.
ఎన్నికల గుర్తుల కేటాయింపులో ప్రతిస్పందనను తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. గుర్తింపు లేని రాజకీయ పార్టీల్లో మొదట వచ్చిన వారికి నచ్చిన గుర్తు మొదట కేటాయింపు విధానాన్ని సవాల్ చేస్తూ నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీ వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల సంఘం అనుసరిస్తున్న మొదట వచ్చిన వారికి మొదట గుర్తుల కేటాయింపు విధానంపై ఎన్టీకే దాఖలు చేసిన పిటిషన్ను మార్చి 1న హైకోర్టు కొట్టివేయడంతో దానిని సవాల్ చేస్తూ ఎన్టీకే సుప్రీంను ఆశ్రయించింది. ఈ కేసును హోలీ తర్వాత విచారిస్తామని కోర్టు తెలిపింది.