న్యూఢిల్లీ: సహజీవనం (Live-In Relationship) ఒక ప్రమాదకరమైన వ్యాధి అని బీజేపీ ఎంపీ విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని పార్లమెంటులో డిమాండ్ చేశారు. గురువారం లోక్సభలో ‘జీరో హవర్’ సందర్భంగా హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘నేను చాలా తీవ్రమైన సమస్యను ప్రభుత్వం, పార్లమెంటు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. భారతీయ సంస్కృతి ‘వసుధైవ కుటుంబం (ప్రపంచం ఒకే కుటుంబం), సోదరభావ తత్వానికి ప్రసిద్ధి చెందింది. మన సామాజిక నిర్మాణం ప్రపంచంలోని ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. భిన్నత్వంలో మన ఏకత్వానికి ప్రపంచం మొత్తం ముగ్ధులైంది. అయితే ప్రేమ వివాహాల వల్ల విడాకుల రేటు ఎక్కువగా ఉంది. అందువల్ల అలాంటి వాటికి వధూవరుల తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయాలి’ అని అన్నారు.
కాగా, ప్రస్తుతం ‘కొత్త వ్యాధి’ ఉద్భవించిందని, ఈ సామాజిక దురాచారాన్ని ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’ అని పిలుస్తున్నారని బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు, పురుషుడు లేదా స్త్రీ వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్నారని అన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి సంబంధాలు చాలా సాధారణమని, అయితే ఈ చెడు మన సమాజంలో కూడా వేగంగా వ్యాపిస్తోందని విమర్శించారు.
మరోవైపు సహజీవనం వల్ల వాటిల్లే పరిణామాలు భయంకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న శ్రద్ధా వాకర్ను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. ఇలాంటి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదకరమైన ఈ వ్యాధిని సమాజం నుంచి నిర్మూలించేందుకు సహజీవనానికి వ్యతిరేకంగా చట్టం చేయాలని సంబంధిత శాఖ మంత్రిని ఆయన అభ్యర్థించారు.