చండీగఢ్: అవినీతి రాజకీయ నాయకుల జాబితా సిద్ధంగా ఉందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారికి గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప ఎన్నిక జరుగనున్న సంగ్రూర్ లోక్సభ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి గుర్మైల్ సింగ్ గెలుపు కోసం బర్నాలాలోని బదౌర్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో పాల్గొన్న సీఎం భగవంత్ మాన్, అవినీతి రాజకీయ నేతల జాబితాలను ప్రభుత్వం తయారు చేసిందని తెలిపారు. ‘ఇప్పటికే కొంత మందిని జైలుకు పంపాం. మరి కొందరు వారి వంతు కోసం వేచి ఉన్నారు. జాబితాలు సిద్ధమయ్యాయి. వారికి బెయిల్ కూడా లభించకుండా కఠినంగా చర్యలు తీసుకుంటాం. మీరు చెల్లించిన పన్నుల డబ్బులను వారు తినేశారు. వాటిని వారి నుంచి తిరిగి రప్పించి మీ కోసం ఖర్చు చేస్తాం. దీని కోసం నాకు కొంత సమయం కావాలి’ అని అన్నారు.
కాగా, పంజాబ్ కాంగ్రెస్కు చెందిన మాజీ అటవీశాఖ మంత్రి సాధు సింగ్ ధర్మసోత్ అవినీతిని సీఎం భగవంత్ మాస్ సింగ్ ప్రస్తావించారు. వారి స్వార్థం కోసం రాష్ట్ర ఆక్సిజన్ అయిన చెట్లను కూడా అమ్మేశారని విమర్శించారు. వారికి కూడా ఆక్సిజన్ అవసరమన్న విషయాన్ని కూడా మర్చిపోయారంటూ దుయ్యబట్టారు.