లక్నో: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంపెట్టుకున్నది. దీనికోసం మద్యం ధరలతోపాటు లైసెన్స్ ఫీజులను భారీగా పెంచనుంది. ఈ మేరకు 2023-24కుగాను కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీని సీఎం యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. దీనిప్రకారం రాష్ట్రంలో మద్యం ధరలు పెద్దమొత్తంలో పెరుగనున్నాయి. అదేవిధంగా విదేశీ లిక్కర్, బీర్లు, భంగ్, మోడల్ షాపులకు సంబంధించిన లైన్సుల ఫీజుమొత్తాన్ని 10 శాతం పెంచాలని నిర్ణయించింది.
లక్నో మున్సిపల్ కార్పొరేషన్కు 5 కిలోమీటర్ల పరిధిలో నడుస్తున్న హోటళ్లు, రెస్టరెంట్లు, క్లబ్లు, బార్లలో లిక్కర్ అమ్మకాలపై అధనంగా లైసెన్స్ ఫీజు పెంచాలనుంది. కాగా, దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు వెచ్చిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.