Arvind Kejriwal | మద్యం పాలసీకి సంబంధించిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. జూన్ 2న ఆయనను లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గతంలో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సోమవారం (మే20) వరకు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను ఈడీ ఆయన అధికారిక నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ కేసులో ఈడీ మద్యం పాలసీకి సంబంధించిన చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో అరవింద్ కేజ్రీవాలతో పాటు ఆయనకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా పేర్కొంది. సిట్టింగ్ సీఎం, రాజకీయ పార్టీ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా 200 పేజీల అనుబంధ చార్జిషీట్ను త్వరలోనే విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. నిందితులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం.. అభియోగాలు మోపాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను ప్రధాన సూత్రధారి అని ఈడీ తెలిపింది. సీఎంతో పాటు ఆప్ నేతలు, ఇతరులతో కుమ్మక్కయ్యారని ఆరోపించింది. ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సుప్రీంకోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ ఒక సెవెన్ స్టార్ హోటల్లో బస చేశారనేందుకు తమ వద్ద ప్రత్యక్ష సాక్ష్యం ఉందని చెప్పారు. మద్యం పాలసీలో వచ్చిన డబ్బులను గోవా ఎన్నికలకు మళ్లించినట్లుగా ఈడీ ఆరోపిస్తున్నది. అయితే, ఈ ఆరోపణలు కేజ్రీవాల్ కొట్టిపడేశారు.