న్యూఢిల్లీ, జూలై 13: కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేయనున్న జాతీయ చిహ్నం విషయంలో రాజుకున్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. పలువురు ప్రతిపక్ష నేతలు ప్రధాని చర్యను తీవ్రంగా తప్పుపడుతుండగా, ఆ చర్యను సమర్థించుకునేందుకు అధికార పక్షం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దీనిపై పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బీమన్ బెనర్జీ మాట్లాడుతూ.. జాతీయ చిహ్నానికి అవమానం జరుగకుండా ఉండాల్సిందని, ముఖ్యంగా ప్రధాని మోదీ సమక్షంలో జరగడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘చట్టం ప్రకారం జాతీయ జెండా, జాతీయ గీతాన్ని అవమానించడం శిక్షార్హమైన నేరం. అదే జాతీయ చిహ్నానికి కూడా వర్తిస్తుంది’ అని పేర్కొన్నారు. బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ మాట్లాడుతూ.. దేశ చరిత్రను ధ్వంసం చేయడంలో భాగంగానే జాతీయ చిహ్నంలో మార్పులు చేశారు’ అంటూ మండిపడ్డారు.
అవసరమైతే కరుస్తది..
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జాతీయ చిహ్నం వివాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోదీ చర్యకు మద్దతిస్తూ ‘సింహానికి దంతాలు వస్తే.. అది తప్పకుండా చూపిస్తుంది. అది స్వతంత్ర భారత సింహం. అవసరమైతే కరుస్తది కూడా’ అంటూ వ్యాఖ్యానించారు.