BS Yediyurappa | వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి మాజీ సీఎం బీఎస్ యెడియూరప్పను తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దమ్ముంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో యెడియూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీని కాంగ్రెస్ పార్టీ నేత ఎంబీ పాటిల్ సవాల్ చేశారు. లింగాయత్లు మౌనంగా ఉండబోరని, నిజానిజాలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. వయో పరిమితి వల్ల సీఎంగా బీఎస్ యెడియూరప్ప గతేడాది రాజీనామా చేశారు. సీఎంగా అడ్డం వచ్చిన వయస్సు.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలోకి యెడియూరప్పను తీసుకోవడానికి అడ్డు రాలేదా? అని ప్రశ్నించారు.
లింగాయత్ల ఓట్లను కాంగ్రెస్ ఆకర్షిస్తుంద భయంతోనే యెడియూరప్పను బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నియమించడాన్ని ఎంబీ పాటిల్ తోసిపుచ్చారు. లింగాయత్ సామాజిక వర్గ నేత యెడియూరప్పను ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవాలన్న అధికార బీజేపీ వ్యూహాలను లింగాయత్ సామాజిక వర్గం పూర్తిగా అర్థం చేసుకుందన్నారు. కర్ణాటకలో బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా లింగాయత్లే. బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప, కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ కూడా లింగాయత్ సామాజిక వర్గ నేతలే కావడం గమనార్హం.
`ఇది బీజేపీ అంతర్గత వ్యవహారమే అయినా.. 75 ఏండ్లు దాటాయాన్న సాకుతో సీఎంగా యెడియూరప్పను తప్పించారు. కానీ, ఇప్పుడు బీజేపీ విధాన నిర్ణాయక కమిటీల్లో చోటు కల్పించారు. బీజేపీ నుంచి యెడియూరప్ప అంటే ప్రత్యేక ప్రేమ ఉందని నేను భావిస్తున్నా. రాష్ట్రంలో మనుగడ కోల్పోతున్న పార్టీకి ఊపిరిలూదేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఇది` అని ఎంబీ పాటిల్ అన్నారు.
రాష్ట్రంలో వస్తున్న సర్వేలు, ప్రజలు, మీడియా అభిప్రాయం, ఇటీవల రాజకీయ పరిణామాలు, సిద్ధరామయ్య 75వ జన్మ దిన వేడుకల నుంచి బీజేపీలో ఆందోళన మొదలైందని ఎంబీ పాటిల్ అన్నారు. `ఇది యెడియూరప్పకు గౌరవం ఇవ్వడం కావచ్చు. కానీ బీజేపీ మనుగడ కాపాడుకోవడమే ముఖ్యం. వచ్చే ఎన్నికల్లో ఆయన పేరును ఉపయోగించుకుంటారు` అని పాటిల్ చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి యెడియూరప్పను తీసుకుంటున్నట్లు బీజేపీ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.