బెంగళూరు: కర్ణాటక మఠాధిపతి ఆత్మహత్య కేసుకు సంబంధించి హనీట్రాప్ చేసిన మహిళతోసహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హనీట్రాప్, బ్లాక్మెయిల్ గురించి వారిని ప్రశ్నిస్తున్నారు. రామనగర జిల్లాలోని కంచుగల్ బందే మఠాధిపతి సంత్ బసవలింగ స్వామి సోమవారం ఉదయం తన ప్రార్థన మందిరంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లింగాయత్ మఠాలకు చెందిన సాధువులు ఇటీవల వరుసగా మరణిస్తుండటంతో ఈ సంఘటన కలకలం రేపింది.
అయితే బసవలింగ స్వామి గదిలో లభించిన సూసైడ్ నోట్పై పోలీసులు దర్యాప్తు చేశారు. గుర్తు తెలియని మహిళ ద్వారా తాను హనీట్రాప్నకు గురైనట్లు, తనను బ్లాక్మెయిల్ చేసి వేధించినట్లు అందులో ఉంది. నాలుగు అసభ్యకర వీడియోలు విడుదల చేస్తామంటూ ఒక మహిళ, మరి కొందరు కలిసి తనను బెదిరించినట్లు ఆ సూసైడ్ నోట్లో ఆయన పేర్కొన్నారు. తన స్థానం నుంచి తొలగించాలని భావించిన కొందరు వ్యక్తులు ఇలా కుట్రపన్నిన్నట్లు ఆయన ఆరోపించారు.
మరోవైపు 45 ఏళ్ల బసవలింగ స్వామి, ఒక మహిళ మధ్య అసభ్యకరంగా సాగిన వీడియో కాల్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానించారు. ఆయనను హనీట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన కోణంలో దర్యాప్తు జరిపారు. బెంగళూరుకు చెందిన ఒక మహిళ, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. బసవలింగ స్వామి ఆత్మహత్యకు పురిగొల్పిన వైనంపై వారిని ప్రశ్నిస్తున్నారు.