ముంబై: కరోనా వైరస్ వల్ల దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ ఈ విషయాన్ని చెప్పింది. దేశ ప్రజల జీవితకాలం తగ్గినట్లు తన నివేదికలో ఆ సంస్థ వెల్లడించింది. కరోనా మహమ్మారి వల్ల ఆడ, మగవారిలో ఆయుష్షు తగ్గినట్లు తేల్చారు. బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు. ఐఐపీఎస్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ నివేదికను పొందుపరిచారు. 2019లో పురుషుల్లో జీవితకాలం 69.2 ఏళ్లు కాగా, ఆడవారిలో 72 ఏళ్లుగా ఉంది. అయితే ఆయుష్షు రెండేళ్లు తగ్గడం వల్ల.. పురుషుల్లో 67.5 ఏళ్లు, మహిళల్లో 69.8 ఏళ్లకు సగటు ఆయుష్షు చేరినట్లు ఆ నివేదికలో తెలిపారు. 2020లో కోవిడ్ వల్ల 35 నుంచి 79 ఏళ్ల వయసున్న వారిలో ఎక్కువ శాతం మరణాలు సంభవించినట్లు తేల్చారు. దీని వల్లే జీవితకాలం తగ్గినట్లు స్పష్టమవుతోందని యాదవ్ అన్నారు.