కోల్కతా, జూలై 6: పశ్చిమబెంగాల్లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర సర్కారు మంగళవారం శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అడ్హక్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో శాసనమండలి కోసం తీర్మానం చేసినట్టు.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ తెలిపారు. 265 మంది సభ్యులు హాజరైన సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా 196 మంది ఓటేయగా, బీజేపీకి చెందిన 69 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఓడిపోయిన నాయకులను అడ్డదారిలో సహకరించేందుకే దీనిని ప్రవేశపెట్టారని బీజేపీ ఆరోపించింది. అలాగే ఈ నిర్ణయం వల్ల ఖజానాపైనా భారం పడుతుందని పేర్కొన్నది.