న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో (JNU) విద్యార్థి సంఘాల మధ్య చెలరేగిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. శ్రీరామనవమి రోజు మాంసాహారం వడ్డించడంపై తలెత్తిన లొల్లి కాస్తా పెద్దదిగామారడంతో ఏబీవీపీ, వామపక్ష జేఎన్యూ విద్యార్థి సంఘానికి (JNUSU) చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. దీంతో ఆరుగురు విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
జేఎన్యూలోని కావేరీ హాస్టల్ క్యాంటీన్లో ఆదివారం మాంసాహారం వడ్డించారు. దీనిపై ఏబీవీపీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేశారు. శ్రీరామనవమి రోజున నాన్వెజ్ వడ్డించడంపై మెస్ సెక్రెటరీని నిలదీశారు. దీంతో సిబ్బంది హాస్టల్ మాంసాహారం వడ్డించడం నిలిపివేశారు. అయితే దీనిని జేఎన్యూ స్టుడెంట్స్ యూనియన్ వ్యతిరేకించింది. ఇది కాస్తా పెద్దదిగా మారి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది.
సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘర్షణలో 60 మందివరకు గాయపడ్డారని ఇరు వర్గాలు ప్రకటించాయి. కాగా, ప్రస్తుతం వర్సిటీలో పరిస్థితి బాగానే ఉందని చాన్సలర్ తెలిపారు.