బెంగాలీ భాష తెలిసిన వారికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మాల్దాలో నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో ఈమె పై వ్యాఖ్యలు చేశారు. ”అన్ని రాష్ట్రాల కోసమే చెబుతున్నాను. బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో బెంగాలీలకే ప్రథమ ప్రాధాన్యమిస్తాం. బంగ్లా భాష కచ్చితంగా తెలిసి ఉండాలి. బెంగాల్ పౌరుడై ఉండాలి. ఇది యూపీ, బిహార్ లాంటి రాష్ట్రాల వారు ఇలాగే చేయాలి” అని మమత సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో గనక స్థానికేతరులు, స్థానిక భాష తెలియని వారు చేరితే, స్థానికులకు చాలా ఇబ్బందులు వస్తాయని ఆమె అన్నారు. స్థానిక ప్రజలు ఏదైనా సమస్య విషయంలో సదురు అధికారి దగ్గరికి వచ్చి, విన్నవించుకున్నా, లేఖ రాసిచ్చినా, ఆ అధికారికి భాషరాకపోవడం వల్ల ప్రజలకు సరైన విధంగా సమాధానం చెప్పలేరని, అందుకే స్థానిక భాష అత్యావశ్యకమని మమత నొక్కి చెప్పారు. స్థానిక భాష తెలియకుంటే ఆ అధికారి ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. అయితే ఈ విషయాన్ని ఆలిండియా సర్వీసులను దృష్టిలో పెట్టుకొని తాను మాట్లాడటం లేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొనే ఇలా మాట్లాడుతున్నానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.