న్యూఢిల్లీ, డిసెంబర్ 26: వ్యూహాలు, ఎత్తుగడలతో సొంత రాష్ట్రం బెంగాల్లో ఇటీవల గెలుపొందిన తృణమూల్ కాంగ్రెస్ గోవాలో ఉనికి కోసం ఆపసోపాలు పడుతున్నదా? మమతా బెనర్జీకి అక్కడ ఎదురుగాలి వీస్తున్నదా? తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. పార్టీకి ఐదుగురు నేతల రాజీనామా, మమత పాల్గొన్న బహిరంగ సభను అక్కడి స్థానికులు పట్టించుకోకపోవడం, హామీలపై ప్రజల్లో నెలకొన్న అపనమ్మకాలు తదితర విషయాలను పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తున్నది.
మతపరంగా విభజిస్తున్నది
ఇటీవలే తృణమూల్లో చేరిన ఐదుగురు సీనియర్ నేతలు శనివారం రాజీనామా చేశారు. గోవా ప్రజలను టీఎంసీ మతపరంగా విభజిస్తున్నదని వారు ఆరోపించారు. రాజీనామా చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్ కూడా ఉన్నారు. గోవాకు టీఎంసీతో మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశ్యంతో మూడు నెలల క్రితమే వీరు పార్టీలో చేరారు. కానీ గోవాను, గోవా ప్రజలను టీఎంసీ అర్థం చేసుకోలేదని వారు తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘హిందువులు అంతా మహారాష్ట్ర గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి, క్రైస్తవులంతా తమకు ఓట్లు వేసేలా టీఎంసీ ప్రచారం చేస్తున్నది. ఇది కచ్చితంగా మతపరమైన రాజకీయమే. గోవా ప్రజలను విడదీసే పార్టీలో ఉండాలని మేం అనుకోవడం లేదు. గోవా ప్రజల విభజనను మేం జరగనివ్వం. గోవాను రక్షిస్తాం’ అన్నారు. ‘టీఎంసీ మతపరమైన పార్టీ కాదని భావించాను. కానీ ఈ నెల 5న టీఎంసీ ఎంజీపీతో పొత్తు పెట్టుకొన్నది. దీంతో టీఎంసీ కూడా మత పార్టీ అని అర్థం అయింది’అని మామ్లేదార్ అన్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు
టీఎంసీ గోవా ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నదని మామ్లేదార్ పేర్కొన్నారు. ‘బెంగాల్లో లక్ష్మి భండార్ పథకం నెలకు రూ.500 ఇచ్చారు. కానీ గోవాలో నెలకు రూ.5వేలు ఇస్తాం అంటున్నారు. ఇది సాధ్యం కాదు. ఓడిపోతాం అని తెలిసినప్పుడే పార్టీలు ఇలా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తాయి’ అని మామ్లేదార్ అన్నారు. రాజీనామా చేసిన వారిలో మంద్రేకర్, కిశోర్ పర్వార్, కోమల్ పర్వార్, సుజయ్ మల్లిక్ కూడా ఉన్నారు
ప్రశాంత్ కిశోర్పై మమత కేకలు
గోవాలో పార్టీకి ఎదురుగాలి వీయడంపై మమత అసహనంతో ఉన్నారు. గోవా పర్యటన సమయంలో మమత సభకు కూడా పెద్దగా జనం రాలేదు. కాంగ్రెస్ నుంచి నేతలు చేరుతున్నా, పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారు. దీంతో మమత తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిశోర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వ్యూహరాహిత్యం వల్లే పరిస్థితి ఇలా ఉందని, పనితీరు సరిగా లేదని ప్రశాంత్ కిశోర్పై మమత కేకలు వేసినట్టు సమాచారం.