న్యూఢిల్లీ: దేశంలో విస్తృత స్థాయిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ఇవాళ తన ట్విట్టర్లో స్పందించారు. అనేక మంది నేతలు వ్యాక్సినేషన్పై నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. వ్యాక్సినేషన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం ద్వారానే వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెరిగిందని మంత్రి తెలిపారు. జూన్ నెలలో 11.50 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. జూలైలో ఇవ్వబోయే కోటా గురించి అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే సమాచారం చేరవేశామన్నారు. జూలైలో 12 కోట్ల కోవిడ్ టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రైవేటు హాస్పిటళ్లకు కూడా అధిక సంఖ్యలో టీకాలు కేటాయించనున్నట్లు మంత్రి తన ట్వీట్లో చెప్పారు. రాష్ట్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే.. ఆయా ప్రభుత్వాలు తమ వ్యాక్సినేషన్ ప్లానింగ్ను మరింత పటిష్టపరుచాలన్నారు. ఇంటర్ స్టేట్ ప్లానింగ్, లాజిస్టిక్స్ లాంటి అంశాలను రాష్ట్రాల పరిధిలో ఉంటాయన్నారు. కరోనా మహమ్మారి వేళ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని, వాళ్లు ఆ ఆరోపణలు మానుకోవాలన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కామెంట్లు చేయడం దురదృష్టకరమని మంత్రి హర్షవర్దన్ అన్నారు. ఒకవేళ వ్యాక్సినేషన్ గురించి తెలియకపోతే, వాళ్లు పరిపాలనపై ఫోకస్ చేయాలన్నారు. ఆందోళన సృష్టించడం కన్నా ప్రణాళికలు వేయడంపై సమయం కేటాయించాలన్నారు.