న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ .. లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రౌజ్ అవెన్యూ కోర్టు ముందు మంగళవారం హాజరైన ఆయనకు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. రేపు ఆ కేసులో మళ్లీ కోర్టు ముందు బ్రిజ్ మళ్లీ హాజరుకావాల్సి ఉంది. అయితే ఎంపీ బ్రిజ్ తరపున డిఫెన్స్ లాయర్గా అడ్వకేట్ రాజీవ్ మోహన్(Advocate Rajiv Mohan) వాదించారు. ఈయనే 2012లో నిర్భయ రేప్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. నిర్భయ కేసులో ఢిల్లీ పోలీసుల తరపున లాయర్ రాజీవ్ మోహన్ వాదించారు. ఆ సమయంలో నిందితులకు మరణశిక్ష విధించాలని ఆయన కోర్టులో వాదించారు.
కానీ మంగళవారం రౌజ్ అవెన్యూ కోర్టులో రాజీవ్ మోహన్ .. బ్రిజ్ భూషణ్ తరపున ప్రతినిధిగా హాజరయ్యారు. బ్రిజ్ బెయిల్ గురించి ఆయన జూలై 20వ తేదీన మళ్లీ వాదించనున్నారు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో 2020 మార్చిలో నలుగురు నిందితుల్ని ఉరి తీసిన విషయం తెలిసిందే. నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. లైంగిక దాడుల చట్టాలను కఠినం చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగాయి కూడా.
ప్రస్తుతం మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎంపీ బ్రిజ్ను పోలీసులు విచారించారు. ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అసంబద్ధ రీతిలో తాకడం, అమ్మాయిల ఛాతిపై చేయి వేయడం, వెనుక భాగంపై చేయి వేసి నిమరడం లాంటి అకృత్యాలకు పాల్పడినట్లు బ్రిజ్పై ఆరోపణలు ఉన్నాయి. మైనర్ నమోదు చేసిన కేసును మళ్లీ వెనక్కి తీసుకున్నారు.