న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్పై ఓ న్యాయవాది బూట్ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని, బయటకు తరలించారు. నిందితుడు రాకేశ్ కిశోర్(71)ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఘటనపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అతడికి నోటీసులు జారీచేయనున్నట్టు తెలిపింది. బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ కథనం ప్రకారం.. లాయర్లు కేసుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో రాకేశ్ వేదిక వద్దకు వెళ్లి తన బూట్ను తీసి సీజేఐపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో అతడు ‘సనాతన ధర్మానికి అవమానాన్ని సహించం’ అని అరిచినట్టు సమాచారం. అయితే దీనిపై సీజేఐ గవాయ్ చలించకుండా వాదనలు కొనసాగించాలని న్యాయవాదులను కోరారు. ‘ఇలాంటి వాటితో కలవరపడకండి. మేం కలవరపడలేదు.
ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కోర్ట్ భద్రతా యూనిట్ విచారణ ప్రారంభించింది. దాడికి యత్నించిన లాయర్ ఉద్దేశం ఏమిటో ఇంకా తెలియలేదు. అయితే ఇటీవల ఖజురహోలో విష్ణుమూర్తి విగ్రహం పునఃస్థాపనకు సంబంధించిన కేసులో సీజేఐ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ దాడి ప్రయత్నం జరిగిందని భావిస్తున్నారు. ఆ కేసును కొట్టేస్తూ ‘వెళ్లి ఆ దేవుడినే ఏదైనా చేయమని అడగండి. మీరు విష్ణు దేవుడికి పరమ భక్తుడినని చెప్తున్నారు కదా. కాబట్టి వెళ్లి ప్రార్థించండి. అది పురావస్తు శాఖ స్థలం. పురావస్తు శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. సీజేఐ మత విశ్వాసాలను దెబ్బ తీశారని సోషల్ మీడియాలో చాలా మంది ఆరోపించారు. అయితే ఆ తర్వాత దీనిపై సీజేఐ స్పష్టతనిస్తూ తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. కాగా, సీజేఐపై దాడిని న్యాయవాదుల సంఘాలు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు ఖండించారు.
మన సమాజంలో ఇలాంటి చర్యలకు చోటు లేదు: మోదీ
సుప్రీం కోర్టులో సీజేఐపై దాడి ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఘటనపై తాను సీజేఐ గవాయ్తో మాట్లాడానని ప్రధాని తెలిపారు. ‘సుప్రీంకోర్టు ఆవరణలో సీజేఐ గవాయ్పై జరిగిన దాడి.. భారతీయులందర్నీ ఆగ్రహానికి గురిచేసింది. ఇలాంటి చర్యలకు మన సమాజంలో చోటులేదు’ అని అన్నారు. ఘటన జరిగినప్పుడు, అటు తర్వాత.. ప్రశాంతతను కాపాడుతూ సీజేఐ స్పందించిన తీరును అభినందించారు.
నేరస్తులను తక్షణం శిక్షించాలి:హరీశ్రావు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీంకోర్టులోనే దాడి చేయాలనుకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికలో స్పందిస్తూ.. ‘భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ జీపై దాడి జరగడం సిగ్గుచేటు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేరస్తులను తక్షణం శిక్షించాలి’ అంటూ పోస్టు చేశారు. సీజేఐపై దాడిని సీపీఐ, సీపీఎం కూడా ఖండించాయి.