ప్రస్తుతం న్యాయమూర్తుల నియామక విధానంలో ప్రభుత్వానిది పరిమిత పాత్రే. జడ్జీల పేర్లను కొలీజియం సిఫారసు చేస్తున్నది. న్యాయమూర్తులను నియమించే అధికారం ప్రభుత్వానిదేనని రాజ్యాంగం సెలవిస్తున్నది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మారనంత వరకూ.. జడ్జీల ఖాళీల సమస్య పెరుగుతూనే ఉంటుంది
-కిరెణ్ రిజిజు
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మాటల దాడి కొనసాగుతూనే ఉన్నది. కొద్దివారాలుగా కొలీజియంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఈసారి పార్లమెంటు వేదికగానే సుప్రీంకోర్టుపై తీవ్ర విమర్శలకు దిగారు. దేశంలో ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉండటానికి కొలీజియం వ్యవస్థనే కారణమని విమర్శించారు. గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో కేంద్రప్రభుత్వ పాత్ర తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం 2014లో తెచ్చిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) మళ్లీ మనుగడలోకి వస్తేనే కోర్టుల్లో నాణ్యమైన న్యాయమూర్తుల నియామకం సాధ్యమవుతుందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొన్నది. కానీ, న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం పాత్ర చాలా పరిమితంగా ఉన్నది. న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సూచిస్తున్నది. దీంతో ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా పోయింది. దేశంలోని భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా, మహిళలకు ప్రాధాన్యం దక్కేలా న్యాయమూర్తుల పేర్లు సూచించాలని సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ప్రభుత్వం కోరింది. కానీ, ప్రస్తుతం ఉన్న నియామక విధానం పార్లమెంటు, దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబించటం లేదు. అందుకే కొలీజియం సూచించే పేర్లను ప్రభుత్వం ఆమోదించలేకపోతున్నది. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం ఉండాలని నేను కోరుకోవటం లేదు. కానీ, న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నం. ఆ విధానం 1993 తర్వాతే మారింది’ అని పేర్కొన్నారు.
కేసుల పెండింగ్ కాలాన్ని తగ్గించాలంటే సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను స్వీకరించకుండా ఉండాలని మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. న్యాయమూర్తుల నియామక విధానం మారనంతవరకు ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ‘బెయిల్ పిటిషన్లు స్వీకరించరాదని కిరణ్ రిజిజు అంటున్నారు. ఆయనకు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసా?’ అని సీనియర్ రాజకీయవేత్త, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. ‘న్యాయశాఖ మంత్రి గతంలో న్యాయశాస్త్రం బోధించని న్యాయ విద్యాలయాల్లో పనిచేసినట్టున్నారు. సరైన పాలన అంటే బెయిల్ తప్ప జైలు కాదన్న జస్టిస్ క్రిష్ణ అయ్యర్ పుస్తకాన్ని ఆయన చదివినట్టు లేదు. బెయిల్ పిటిషన్లు స్వీకరించరాదని సుప్రీంకోర్టుకు న్యాయశాఖ మంత్రి ఎలా సూచిస్తారు?’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎన్జేఏసీని మర్చిపోండి.. ప్రభుత్వం న్యాయవ్యవస్థను తనకు నచ్చినట్టు ఆడించాలని కోరుకొంటున్నది. సెలవులు రద్దు.. బెయిల్ పిటిషన్లకు ప్రాధాన్యం ఇవ్వవద్దు.. ఇక తర్వాత ఏమిటి?’ అని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ప్రశ్నించారు. ‘కిరణ్ రిజిజు వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నేరు దాడిచేయటమే. మోదీ ప్రభుత్వం తన సొంత మనుషులను న్యాయవ్యవస్థలో చొప్పించగలిగే విధానం వచ్చేవరకు జడ్జీల పోస్టులు భర్తీచేసేది లేదని న్యాయశాఖ మంత్రి అంటున్నారు. మరో వ్యవస్థను గుప్పిటపట్టేందుకు చేస్తున్న ప్రయత్నమిది’ అని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఆక్షేపించారు.