న్యూఢిల్లీ, జూలై 22: జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక విషయాలు వెల్లడించింది. లోక్సభతో పాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించిందని, ఆ నివేదిక ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నదని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. రిపోర్టులోని అంశాలపై లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నదని, జమిలి ఎన్నికల నిర్వహణపై ప్రణాళికను తయారు చేసే పనిలో ఉన్నదని తెలిపింది. ఈ మేరకు ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి కిరెన్ రిజుజు శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ(పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్) కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చిందని వెల్లడించారు. పార్లమెంట్కు, అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగడం వలన సాధారణ ప్రజాజీవితానికి భంగం కలుగుతున్నదని, ఇదే సమయంలో అత్యవసర సేవలపై ప్రభావం పడుతుందని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడినట్టు చెప్పారు. వేర్వేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ఖర్చు అవుతున్నదని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆ ఖర్చు తగ్గించుకోవచ్చని సూచించిందని తెలిపారు. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేండ్లలో ఎన్నికల నిర్వహణపై రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.