శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు శుక్రవారం లష్కరే తోయిబా ఉగ్రసంస్ధ కుట్రను ఛేదించాయి. హైబ్రిడ్ టెర్రిస్టులుగా యువతను ప్రోత్సహిస్తూ వ్యూహాలు అమలుచేస్తున్న ఆరుగురు ఉగ్రవాద సహాయకులను పుల్వామాలో అరెస్ట్ చేశారు. హైబ్రిడ్ టెర్రరిస్టులుగా యువతను ప్రేరేపించి వారికి రవాణా సదుపాయాలు, ఆశ్రయం కల్పిస్తున్న ఈ ముఠా కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.
ఓవర్గ్రౌండ్ వర్కర్లుగా పిలిచే వీరంతా ఎప్పటికీ అజ్ఞాతంలో ఉండరని, కొన్ని కార్యకలపాలను చేపట్టిన తర్వాత తిరిగి సాధారణ జీవితం గడుపుతుంటారని అందుకే వీరిని హైబ్రిడ్ ఉగ్రవాదులు, టెర్రిరస్ట్ అసోసియేట్స్గా పిలుస్తుంటారని భద్రతా దళాలు వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ 150 మందికి పైగా ఓవర్గ్రౌండ్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నామని కశ్మర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
తప్పుదారిపట్టిన యువతను తిరిగి గాడిన పెట్టేందుకు భద్రతా దళాలు, పోలీసులు సంయుక్త ఆపరేషన్లు చేపడుతున్నారని చెప్పారు. వీరందరినీ లొంగిపోయే అవకాశం ఇస్తున్నామని, మిలిటెన్సీ నేపధ్యం ఉన్నవారు, రాళ్లదాడులకు పాల్పడేవారు, ఆయుధాలు చేపట్టాలనే ఆసక్తి ఉన్న యువత హైబ్రిడ్ టెర్రరిస్టులుగా మారేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.