నేషనల్ డెస్క్: ఇరుగుపొరుగు ఇండ్లకు, సరిహద్దు దేశాలకు పెద్ద తేడా లేదు. మన ఇంటి చుట్టు పక్కల ఇండ్లు బాగుంటేనే మనకు మనఃశాంతి. మన చుట్టు పక్కల దేశాలు బాగుంటేనే దేశానికి ఆర్థికంగా, భద్రతాపరంగా మంచిది. కానీ, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న దేశాల్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇండియాకు తలనొప్పిగా మారాయి. భారతదేశ విదేశాంగ విధానానికి సవాళ్లు విసురుతున్నాయి. దౌత్యపరంగా కొత్త చిక్కులు తెస్తున్నాయి. వీటిల్లో కొన్నింటికి కేంద్రంలోని బీజేపీ సర్కారు విదేశాంగ విధానంలోని లోపాలు కారణమైతే.. మరికొన్ని ఆయా దేశాల్లోని అంతర్గత వ్యవహారాలే కారణం.
పాకిస్థాన్లో రాజకీయ అస్థిరత కొత్తేమీ కాదు. కానీ నయా పాకిస్థాన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ అయినా పూర్తి కాలం పదవిలో ఉంటారని భావించారు. కానీ పాక్ తీరు మారలేదు. ఇమ్రాన్ మధ్యలోనే దిగిపోవాల్సి వచ్చింది. ఇమ్రాన్ పార్టీకి చెందిన 133 మంది ఎంపీలు రాజీనామాలు చేశారు. కొత్త ప్రధాని కూడా ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. దీంతో పాటు పాక్ రాజకీయ వ్యవహారాల్లో సైన్యం జోక్యం తెలిసిందే. భారత్, పాక్ మధ్య శాంతియుత వాతావరణానికి ముందడుగు పడే అవకాశం లేకపోగా.. ఈ సంక్షోభాన్ని ఉగ్రవాదులు అవకాశంగా మల్చుకొని ఇండియాకు భద్రతాపరమైన సమస్యలు తీసుకురావచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
పొరుగుదేశం, చిరకాల మిత్రదేశం శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభం వేధిస్తున్నది. తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. నిత్యావసరాల ధరలు అనేక రెట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక నుంచి ఇండియాకు శరణార్థుల ముప్పు పొంచి ఉన్నది. మరోవైపు, శ్రీలంకలో భారత్ వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయాయి. శ్రీలంక ఆర్థిక పరిస్థితి చితికిపోవడాన్ని ముందుగా గుర్తించిన చైనా.. అప్పులిచ్చి తన ప్రాబల్యం పెంచుకొన్నది. ఇది దౌత్యపరంగా భారత్కు తలనొప్పిగా మారింది. చైనా అప్పు మత్తు నుంచి శ్రీలంక ఇప్పుడిప్పుడే మేలుకొంటున్నది. సంక్షోభంలో చిక్కుకొన్న శ్రీలంకకు ఇండియా ఇప్పటివరకు 2.5 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది.
మాల్దీవుల్లో అభివృద్ధి పేరుతో ఇండియా పాగా వేస్తున్నదని మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ‘ఇండియా అవుట్’ నినాదంతో ఓ నకిలీ ఉద్యమానికి తెరలేపారు. గతేడాది ఫిబ్రవరిలో మాల్దీవులు, ఇండియా సైనిక ఒప్పందం చేసుకోవడంతో ఈ ఉద్యమం తీవ్రమైంది. చైనా ఆదేశాల మేరకే ఈ ఉద్యమం జరుగుతున్నదన్న ఆరోపణలున్నాయి. అయితే, ఈ ఉద్యమం కారణంగా మాల్దీవుల్లో ఇండియా పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకొన్నాయి. ఈ వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే స్పష్టతనిచ్చారు. మాల్దీవుల అభివృద్ధికే ఇండియా కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇండియా ఔట్ నినాదాలు ఆగడం లేదు.
కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా మావేనని నేపాల్ రెండేండ్ల క్రితం తీర్మానం చేసింది. భారత్కు చిరకాల మిత్రదేశమైన నేపాల్తో సరిహద్దు వివాదాలు రేగడం, ఇండియాకు చెందిన భూభాగాలు తమవేనని ఆ దేశ పార్లమెంటు తీర్మానం చేయడం బీజేపీ సర్కారు దౌత్యవిధానాల వైఫల్యమేనని అప్పట్లోనే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు, అఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు అధికారంలో ఉన్నారు. తాలిబన్లను అడ్డం పెట్టుకొని పాకిస్థాన్ ఉగ్రవాదులను ఇండియాలోకి పంపవచ్చని అనుమానిస్తున్నారు. మయన్మార్లో మిలిటరీ పాలన ఉంది. ఈ మిలిటరీకి చైనాకు దగ్గరి సంబంధాలున్నాయి. అందుకే, మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుట్రకు బలైనప్పటికీ భారత్ స్పందించలేని పరిస్థితి.
రెండు మూడేండ్లుగా చైనా భారత్పై దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తున్నది. ముఖ్యంగా డోక్లాం ఘటన తర్వాత చైనా సైన్యం సరిహద్దు వెంబడి కవ్వింపులకు పాల్పడుతున్నది. గల్వాన్ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా చెడాయి. మరోవైపు, గడిచిన ఐదారేండ్లలో చైనా తన ప్రాభవాన్ని పెంచుకొన్నది. ఎగుమతులతో ప్రపంచమంతటికి విస్తరించింది. ఆర్థికంగా బలపడి, అమెరికాను ఎదిరించే స్థాయికి ఎదిగింది. ఇండియా చుట్టుపక్కల దేశాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది. పాకిస్థాన్, తాలిబన్ల, మయన్మార్లో మిలిటరీ పాలనకు మద్దతు, శ్రీలంకలో పోర్టుల నిర్మాణం పేరుతో అప్పుల్లో ముంచి తన చెప్పు చేతల్లో పెట్టుకోవడం, మాల్దీవుల్లో ఇండియా వ్యతిరేక ఉద్యమం లేవదీయడం లాంటి వాటితో ఒక రకంగా ఇండియాను దిగ్బంధించే ప్రయత్నం చేస్తున్నది.