ముంబై: కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి (Maharashtra Landslides). ఈ సంఘటనలో 13 మంది మరణించారు. సుమారు 48 కుటుంబాలకు చెందిన వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ఇర్షల్వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇళ్లలో నిద్రిస్తున్న వారిలో 12 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. సుమారు 48 కుటుంబాలు నివసిస్తున్న ఇండ్లు కూలిపోయాయి. శిథిలాల నుంచి 12 మృతదేహాలను వెలికి తీశారు. రెస్క్యూకు చెందిన ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. సుమారు వందల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
కాగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి 22 మందిని రక్షించారు. సీఎం ఏక్నాథ్ షిండే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ చర్యలను పర్యవేక్షించారు. మరణించిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.