కాన్పూర్: సుమారు 12 కోట్ల ఖరీదైన లాంబోర్గిని లగ్జరీ కారు(Lamborghini Car)తో ఓ సంపన్నుడి కుమారుడు బీభత్సం సృష్టించాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన ఆదివారం జరిగింది. స్థానిక టొబోకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడిగా అతన్ని గుర్తించారు. పాదాచారులను ఢీకొట్టి, అనేక వాహనాలపై కూడా ఆ లగ్జరీ కారుతో దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో ఆ కారును పోలీసులు సీజ్ చేశారు. అత్యంత వేగంగా లాంబోర్గిని రివెల్టో కారును డ్రైవర్ నడిపినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. డ్రైవర్ శివమ్ మిశ్రా .. తాగిన మైకంలో ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్నం 3.15 నిమిషాలకు రెవ్-3 మాల్ వద్ద ప్రమాదం జరిగింది. వ్యాపారవేత్త కేకే మిశ్రా కుమారుడే శివమ్ మిశ్రా.
తొలుత కారు ఓ ఆటోరిక్షాను ఢీకొట్టింది. ఆ తర్వాత పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ను క్రష్ చేసింది. దీంతో ఆ టూవీలర్పై ఉన్న వ్యక్తి 10 మీటర్ల ఎత్తుకు ఎగిరిపడ్డాడు. మోటర్సైకిల్ను కొంత దూరం తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ పోల్ను ఢీకొని ఆగిపోయింది. గాయపడ్డ వ్యక్తుల్లో తౌఫీక్ అహ్మద్ ఉన్నాడు. అతను అనేక మీటర్ల దూరం ఎగిరిపడ్డాడు. డ్రైవర్ మిశ్రాను కాపాడేందుకు అతని బౌన్సర్లు ప్రయత్నించారు. లాంబోర్గిని వెంట మరో కారులో ఆ బౌన్సర్లు వచ్చారు. బౌన్సర్లు అక్కడ ఉన్న జనంతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. కోపంతో రగిలిపోయిన స్థానికులు లాంబోర్గిని అద్దాలను పగలగొట్టి మిశ్రాను బయటకు గుంజేశారు.
సుమారు 12 కోట్ల ఖరీదైన ఆ కారు.. ఢిల్లీలోని రోహిణిలో రిజిస్టర్ అయి ఉన్నది. ఆర్టీవో కోడ్ ప్రకారం దీన్ని నిర్ధారించారు. చాలా వరకు ధ్వంసమైన ఆ కారును ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంచారు. నిందితుడు శివమ్ మిశ్రా కొన్నాళ్ల నుంచి మూర్ఛవ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఫిట్స్ రావడం వల్లే శివమ్ అదుపు తప్పి ఉంటాడని అతని కుటుంబం పేర్కొన్నది. అయితే డ్రైవర్ శివమ్ ఆరోగ్య కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు.