పాట్నా : అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కిడ్నీ దానం చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పేర్కొన్నారు. ఈ మేరకు రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు. అవును అది నిజమే. ఒక బిడ్డగా తన తండ్రికి కిడ్నీ దానం చేయడాన్ని గర్వపడుతున్నాను అని రోహిణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోహిణి తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ సింగపూర్లో చికిత్స తీసుకున్నారు. ఈ సందర్భంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని లాలూకు వైద్యులు సూచించారు.
ఈ మేరకు లాలూకు కొత్త జీవితం ప్రసాదించేందుకు ఆయన కుమార్తె ముందుకొచ్చారు. వైద్యుల సూచనల మేరకు కిడ్నీ దానం చేసేందుకు సింగపూర్లో ఉంటున్న ఆయన చిన్న కుమార్తె రోహిణి సుముఖుత వ్యక్తం చేశారు. అయితే ఇందుకు ముందు లాలూ నిరాకరించారని.. కుమార్తె ఒత్తిడి తీసుకురావడంతో అంగీకరించాల్సి వచ్చిందని సమీప బంధువు ఒకరు తెలిపారు. కిడ్నీ మార్పిడి కోసం నవంబర్ 20-24 మధ్య ఆయన సింగపూర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్పారు.