న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సింగపూర్ వెళ్లారు. కిడ్నీ సంబంధి సమస్యతో బాధపడుతున్న ఆయనకు సింగపూర్లో శస్త్రచికిత్స చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో లాలూ చిన్న కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీని ఆయనకు అమర్చనున్నారు. దీంతో చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, మరికొంత మంది కుటుంబీకులతో కలిసి సింగపూర్ బయల్దేరారు.
గత కొన్నేండ్లుగా కిడ్నీ, గుండె సమస్యలకు లాలూ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసకుంటున్నారు. ఇక్కడి డాక్టర్లు ఆయనకు కిగ్నీ మార్పిడిని సుచించలేదు. కానీ, తండ్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందిన రోహిణి.. ఆయనను సింగపూర్లోని డాక్టర్లు చూపించింది. దీంతో వారు లాలూకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తన తండ్రికి కిడ్నీ ఇచ్చేందుకు రోహిణి ముందుకు వచ్చింది. తన తండ్రికి కిడ్నీ మార్పిడి విజయవంతమవుతుందని తేజస్వీ విశ్వాసం వ్యక్తంచేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని శ్రేయోభిలాషులు ప్రార్ధిస్తున్నారని చెప్పారు.