పట్నా : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వైద్య చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్లనున్నారు. లాలూ పాస్పోర్టును రిలీజ్ చేయాలని సీబీఐ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో లాలూ విదేశీ పర్యటనకు మార్గం సుగమమైంది.
సింగపూర్లో చికిత్స నిమిత్తం వైద్య కారణాల నిమిత్తం తన పాస్పోర్ట్ను రిలీజ్ చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ సెప్టెంబర్ 13న సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అభ్యంతరాలను తోసిపుచ్చిన రాంచీలోని ప్రత్యేక న్యాయస్ధానం లాలూ పాస్పోర్ట్ రిలీజ్ చేయాలని ఆదేశించింది.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆర్జేడీ చీఫ్కు సింగపూర్లో ఈనెల 24న నెఫ్రాలజిస్ట్, స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ లభించిందని ఆయన న్యాయవాది అనంత్ కుమార్ విజ్ తెలిపారు. అంతకుముందు జూన్ 14న రెన్యువల్ కోసం లాలూ ప్రసాద్ పాస్పోర్ట్ను రిలీజ్ చేయాలని ప్రత్యేక న్యాయస్ధానం ఆదేశించింది.