న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో ఆయనను బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో కుడి భుజం ఫ్రాక్షరైంది. ఈనేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను పట్నాలోని పరాస్ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు.
లాలూ గతకొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ చెప్పారు. ఢిల్లీలోని వైద్యులు గతంలో ఆయనకు చికిత్స చేశారని, మరీ అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామని వెల్లడించారు.