Parliament security breach | న్యూఢిల్లీ : పార్లమెంట్లో కలర్ స్మోక్ దాడి ఘటనకు సంబంధించిన ప్రధాన వ్యూహకర్త లలిత్ ఝా నిన్న రాత్రి ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే సాగర్ శర్మ, మనోరంజన్, నీలం దేవి, అమోల్ షిండే మొబైల్స్ను లలిత్ ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకే లలిత్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
పార్లమెంట్ బయట కలర్ స్మోక్ వదిలిన దృశ్యాలను లలిత్ మొబైల్లో చిత్రీకరించి, కోల్కతాకు చెందిన ఓ ఎన్జీవో గ్రూప్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీడియో వైరల్ అయింది. అనంతరం పార్లమెంట్ పరిసరాల నుంచి లలిత్ పారిపోయారు. 48 గంటల తర్వాత ఢిల్లీకి తిరిగొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఢిల్లీ నుంచి రాజస్థాన్ వెళ్లి, అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఉన్నట్లు లలిత్ తెలిపాడు. రెండు రోజుల అనంతరం మహేశ్ అనే వ్యక్తితో కలిసి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నాడు లలిత్.
ప్రస్తుతం లలిత్ ఝా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. అతన్ని విచారిస్తున్నారు పోలీసులు. మొబైల్స్ను కాల్చి వేసినట్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్లను పరిశీలిస్తే కానీ దాడికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇక సాగర్, అమోల్, నీలం, మనోరంజన్ను పోలీసులు ఏడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకోనున్నారు.