లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం దాదాపు 5,000 పేజీల ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా టేని కుమారుడు ఆశిష్ మిశ్రాను కూడా నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో అరెస్టైన ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. మరో వ్యక్తి పేరు కూడా చేర్చడంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 14కు చేరింది. ‘ఛార్జిషీట్లో వీరేంద్ర శుక్లా అనే మరో వ్యక్తి పేరును చేర్చారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 201 కింద అభియోగాలు మోపారు’ అని ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు.
ఇటీవల రద్దైన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసన నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో హింస రాజుకున్నది. రోడ్డు పక్కగా నిరసన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా వాహనం దూసుకెళ్లి తొక్కివేయడంతో పలువురు రైతులు మరణించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆ వాహనంతోపాటు మరో వాహనాన్ని తగులబెట్టారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ హింసాత్మక హింసాత్మక ఘటనలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, వాహన డ్రైవర్ ఉన్నారు.
కాగా, నిందితుల్లో ఆశిష్ మిశ్రా, కేంద్ర మాజీ మంత్రి అఖిలేష్ దాస్ మేనల్లుడు అంకిత్ దాస్ కూడా ఉన్నారు. వీరేంద్ర శుక్లాతో పాటు మొత్తం 13 మంది నిందితులు, మూడు ఎస్యూవీల డ్రైవర్లు, మిశ్రా, దాస్ల సహచరులు అరెస్టయ్యారు. వారంతా ప్రస్తుతం లఖింపూర్ ఖేరీ జైలులో ఉన్నారు. అయితే శుక్లాను అరెస్టు చేశారా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు. మరోవైపు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ అలహాబాద్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నది.