న్యూఢిల్లీ, మార్చి 31: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి ఆయన నివాసానికే వెళ్లి పురస్కారాన్ని అందించారు.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అద్వానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రధాని మోదీ పక్కనే కూర్చొని ఉండగా, భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అద్వానీ అందుకున్నారు. అద్వానీకి భారతరత్న ప్రదానంపై ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. ‘ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, దేశ ప్రగతికి ఆయన చేసిన నిరంతర కృషికి గుర్తింపు ఇది. నవభారత నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయనతో సన్నిహితంగా పనిచేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నా’ అని అన్నారు.