డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఏప్రిల్ నెలలో జరిగిన మహా కుంభమేళాలో కరోనా టెస్టింగ్ కుంభకోణానికి సంబంధించి రెండు ప్రైవేట్ ల్యాబ్లతోపాటు మాక్స్ కార్పొరేట్ ఏజెన్సీపై కేసు నమోదైంది. నెల రోజులపాటు జరిగిన ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి సుమారు 70 లక్షల మంది భక్తులు హాజరై పవిత్ర గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా హరిద్వార్లో అనుమతించిన 22 ల్యాబ్స్ సుమారు 2.5 లక్షలకుపైగా భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించాయి. అయితే కేవలం 2,500 మందికి మాత్రమే పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. కాగా, చాలా మంది భక్తుల ఐడీ కార్డు, మొబైల్ నంబర్ ఆధారంగా లక్షకుపైగా నకిలీ కరోనా ఫలితాలను పలు ల్యాబ్స్ ఇచ్చినట్లు వెలుగుచూసింది. దీనిపై హరిద్వార్ పాలనా యంత్రాంగం గత వారం దర్యాప్తునకు ఆదేశించింది. చాలా ల్యాబ్స్ నకిలీ కరోనా టెస్ట్ రిపోర్టులు ఇచ్చాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బుధవారం మరో దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఈ స్కామ్పై ఫిర్యాదు చేసింది. మాక్స్ కార్పొరేట్ ఏజెన్సీతో పాటు లాల్చందాని ల్యాబ్స్, నల్వా ల్యాబ్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంతో వీటిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సెంథిల్ అబుదై కృష్ణరాజ్ తెలిపారు. మరోవైపు కుంభమేళా కరోనా టెస్టింగ్ స్కామ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తీరత్ సింగ్ రావత్ హెచ్చరించారు.