Kumaraswamy- Deve Gowda | లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పోటీపై జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు అతడ్ని కావాలని కోరుకుంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని దేవెగౌడ గురువారం చెప్పారు. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీపై పోరు కోసం బీజేపీ, జేడీఎస్ చేతులు కలిపాయి. `కుమారస్వామి వదంతులను పక్కన పెట్టేస్తారు. ప్రధాని మోదీ ఏం చెప్పారో నాకు తెలియదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని మోదీ చెబితే ఆయన (కుమారస్వామి) రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పోటీ చేస్తారు. మండ్య, తూమకూరు, చిక్కబళ్లపుర సీట్లలో ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చు. ఆయనను పలు స్థానాల నుంచి పోటీ చేయాలని ఆహ్వానాలు వస్తున్నాయి` అని మీడియాతో అన్నారు.
తనకు తెలిసిన సమాచారం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించి కుమారస్వామిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారన్న చర్చలు తనతో జరుగలేదని దేవెగౌడ చెప్పారు. తన మనుమడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. `నిఖిల్ కుమారస్వామిని పోటీ చేయించవద్దని కుమారస్వామి భావిస్తున్నారని చెప్పారు. కానీ, మండ్య నుంచి నిఖిల్ కుమారస్వామి గానీ, కుమారస్వామి గానీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేయాలని ఆ ప్రాంత నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారని తెలిపారు. ఒకవేళ కుమారస్వామి ఆమోదిస్తే నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తారని అన్నారు.
తనతోపాటు తన కుమారుడు కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని కుమారస్వామి భావిస్తున్నారని దేవెగౌడ చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సారధ్యం వహించడంతోపాటు ప్రచారం చేయాలని భావిస్తున్నారని అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మాండ్యా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమారస్వామి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో సినీ నటి సుమలతా అంబరీష్.. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక మరో మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ కూడా హసన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని దేవగౌడ సంకేతాలిచ్చారు.