బెంగళూరు: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), మాజీ సీఎం కుమారస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(ఎస్)ను ఆయన దాదాపుగా బీజేపీలో విలీనం చేశారని అన్నారు. హనుమాన్ జెండా వివాదంపై మాండ్యాలో బీజేపీ, హిందూ సంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాషాయ శాలువా ధరించారు. దీని గురించి మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ స్పందించారు. కుమారస్వామి తన పార్టీని దాదాపుగా బీజేపీలో విలీనం చేసినట్లేనని విమర్శించారు. ‘కాషాయ శాలువా లేదా మరేదైనా శాలువా ధరించడాన్ని కుమారస్వామి ఎంచుకోవచ్చు. అది ఆయన పార్టీ అంతర్గత విషయం. మాండ్యాలో రాజకీయ పునాది కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎవరు ఎవరిని మింగేస్తారో తెలియడం లేదు’ అని అన్నారు.
కాగా, మాండ్యాలో హనుమాన్ జెండా వివాదంపై ప్రజలను రెచ్చగొట్టడానికి బీజేపీ, జేడీ(ఎస్) ప్రయత్నిస్తున్నాయని డీకే శివకుమార్ ఆరోపించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో గ్రామస్తులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘బీజేపీ, జేడీ(ఎస్) మాండ్యాలో ఈ కొత్త ప్రయోగానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఇక్కడి ప్రజలు లౌకికవాదులు, సహనశీలులు’ అని డీకే శివకుమార్ అన్నారు.