తిరువనంతపురం: కేఎస్ఆర్టీసీని ఇన్నాళ్లూ కేరళ, కర్ణాటకల్లోని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లకు వాడేవారు. కానీ ఇక నుంచి దీనిని కేవలం కేరళలో మాత్రమే వాడాలి. కేఎస్ఆర్టీసీ సంక్షిప్త నామంతోపాటు ఏనుగు బండి అనే నిక్నేమ్ను కేరళకు కేటాయిస్తూ ట్రేడ్మార్క్ ఆఫ్ రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు రాష్ట్రాలూ కేఎస్ఆర్టీసీ (కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్)నే ఉపయోగిస్తున్నాయి. కానీ 2014లో ఈ సంక్షిప్త నామం తమదని, కేరళ వాడకూడదంటూ కర్ణాటక ఆ రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది.
దీంతో కేఎస్ఆర్టీసీని తమకు కేటాయించాలంటూ అప్పటి కేరళ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఆంటోనీ చాకో.. రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్మార్క్స్కు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఏడేళ్ల పాటు రెండు రాష్ట్రాల మధ్య లీగల్ పోరు నడిచింది. చివరికి 1999 ట్రేడ్మార్క్స్ చట్టం ప్రకారం.. కేఎస్ఆర్టీసీని కేరళకు కేటాయిస్తూ శుక్రవారం ట్రేడ్మార్క్స్ రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం తమ రోడ్డు రవాణా పేరు మాత్రమే కాదని, తమ సంస్కృతికి అద్దం పట్టేదని కేరళ రోడ్డు రవాణా మంత్రి ఆంటోనీ రాజు అన్నారు. కేఎస్ఆర్టీసీని కేవలం కేరళలోనే ఉపయోగించాలని, త్వరలోనే తాము కర్ణాటకకు నోటీసులు పంపిస్తామని కేఎస్ఆర్టీసీ చైర్మన్ బిజు ప్రభాకర్ చెప్పారు.