న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. జులై 1న కోర్టు ఎదుట హాజరు కావాలని శివకుమార్ను ఆదేశించింది. మే 26న డీకే శివకుమార్ సహా పలువురిపై ఢిల్లీ కోర్టు ముందు ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.
డీకే శివకుమార్, ఢిల్లీలోని కర్నాటక భవన్ ఉద్యోగి ఆంజనేయ హనుమంతయ్యతో పాటు పలువురిపై 2018 సెప్టెంబర్లో ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. కాగా ఈ కేసులో డీకేను మూడేళ్ల క్రితం అరెస్ట్ అయ్యారు. 2017, 2018 మధ్య చేసిన తనిఖీల ఆధారంగా 2019 సెప్టెంబర్లో డీకేను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
కాగా తనకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేయడంపై డీకే శివకుమార్ స్పందిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని పరోక్షంగా కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. తనపై ఆరోపణలు ఉంటే ఇన్నేళ్లు ఎందుకు చర్యలు చేపట్టకుండా ఇప్పుడే ఎందుకు హడావిడి చేస్తున్నారని డీకే నిలదీశారు.