జైపూర్: హెల్మెట్ ధరించని విద్యార్థినిని ట్రాఫిక్ పోలీస్ బెదిరించాడు. తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలని, లేకపోతే రూ.10,000 చలానా విధిస్తానని హెచ్చరించాడు. కంగుతిన్న ఆ యువతి మళ్లీ కలుస్తానంటూ అతడి నుంచి తప్పించుకుంది. అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్లోని కోటాలో ఈ సంఘటన జరిగింది.
ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చదువుతున్న యువతి శనివారం ఉదయం స్కూటీపై వెళ్తున్నది. క్యాడ్ సర్కిల్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కైలాష్ ఆమె వాహనాన్ని ఆపాడు. హెల్మెట్ ధరించకపోవడంపై ఆమెను ప్రశ్నించాడు. నీకు పెళ్లి అయ్యిందా అని అడిగాడు. తనతో స్నేహం చేయాలని అన్నాడు. ఇంటి వద్ద భార్య, పిల్లలు లేరని, తన వెంట వస్తే మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పాడు. తన కోరిక తీర్చకపోతే రూ.10,000 చలానా విధిస్తానని బెదిరించాడు.
కాగా, మళ్లీ కలుస్తానని చెప్పిన ఆ యువతి ఆ పోలీస్ కానిస్టేబుల్ బారి నుంచి తప్పించుకుంది. అనంతరం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి దీనిపై ఫిర్యాదు చేసింది. అలాగే జరిగిన సంఘటన గురించి మీడియాకు వెల్లడించింది. దీంతో ఆ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.