కోటా, ఫిబ్రవరి 9: రాజస్థాన్లోని కోటాకు చెందిన 17 ఏళ్ల ఆర్యన్ సింగ్ అనే విద్యార్థి రైతులకు సహాయకారి అయిన రోబోను కనిపెట్టాడు. నేల స్వభావంతోపాటు పంటకు ఎంత నీరు అవసరమవుతుందో కూడా ఈ రోబో కచ్చితంగా అంచనా వేయగలదు. తెగుళ్లను గుర్తించగలదు. అది ఇది అని కాదు.. ఒక రైతుకు పంట పండించటంలో అవసరమైన పలు రకాల సేవలను ఈ ఒక్క రోబో అందిస్తుంది. తన పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్లో అగ్రి రోబోను తయారు చేశాడు. ఇందుకోసం నాలుగేండ్లు శ్రమించాడు. పదవ తరగతి చదువుతున్నప్పుడు మల్టీ టాస్క్ పరికరాన్ని డెవలప్ చేయాలని ఆలోచించానని ఆర్యన్ తెలిపాడు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని.. రైతుల కష్టాలు తనకు తెలుసని తెలిపాడు. ఈ అగ్రి రోబో కటింగ్, నీటిపారుదల, లోడింగ్, భూసార పరీక్ష తదితర అనేక పనులను సింగిల్ హ్యాండెడ్గా చేయగలదని ఆర్యన్ పేర్కొన్నాడు. ఈ ఇన్నోవేషన్కు గాను ఆర్యన్ ఇప్పటికే 15 జాతీయ అవార్డులు అందుకున్నాడు. ఈ ప్రొటోటైప్ రోబోను తయారు చేయటానికి తనకు 50 వేల ఖర్చ అయ్యిందని, వీటిని పెద్ద సంఖ్యలో కనుక ఉత్పత్తి చేస్తే ఖర్చు తగ్గుతుందని ఆర్యన్ తెలిపాడు. తాను రూపొందించిన ఈ అగ్రి రోబో సంవత్సరంలోగా మార్కెట్లోకి వస్తుందని ఆర్యన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
నేల, పంట ఆరోగ్యం, పంటకు నీటి అవసరాలు, చీడపీడలు గుర్తించడంలో ఈ రోబో ఎంతో ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి విశ్లేషించటానికి ఈ అగ్రిరోబోకు కెమెరాలు అమర్చారు. రోబో పై భాగంలో ఓ డ్రాపర్ కూడా ఉన్నది. ఇది పొలంలో విత్తనాలు, నీటిని చల్లటానికి సహాయం చేస్తుంది. దీని వల్ల రైతుకు ఎంతో శ్రమ తగ్గుతుంది. రోబోలో మట్టి తేమ సెన్సార్లు కూడా అమర్చబడి ఉన్నాయి. ఇవి భూమి స్వభావాన్ని అంచనా వేసి, ఏవైనా తెగుళ్లు ఉన్నాయా అన్నది తెలియచేస్తుంది. ఈ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తుంది. దీన్ని రిమోట్తో కూడా ఆపరేట్ చేయవచ్చు. మీరు వేరే ప్రాంతంలో ఉన్నా సరే.. మీ పొలంలో రోబోను ఉపయోగించవచ్చని ఆర్యన్ తెలిపారు. అంతేకాదు..ఈ రోబో సౌరశక్తితో కూడా నడుస్తుంది.