కోల్కతా : బహిష్కృత బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మపై కోల్కతా పోలీసులు శనివారం లుక్ అవుట్ సర్క్యులర్ జారీచేశారు. ఆమెను అమ్హెరెస్ట్, నార్కెల్దంగా పోలీస్స్టేషన్ల ఎదుట హాజరుకావాలని కోరారు. అయితే, ఇప్పటి వరకు ఆమె హాజరుకాకపోగా.. మరింత సమయం కోరింది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సుప్రీం తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. తన ప్రాణాలకు భయం ఉందని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసును పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
అయితే పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల అనంతరం దేశంలో జరుగుతున్న ఘటనకు ఆమె బాధ్యురాలని మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. ఆమె తన వ్యాఖ్యల ద్వారా దేశంలోని ఎంతో మంది భావోద్వేగాలను రెచ్చగొట్టిందని ఫైర్ అయ్యింది. ఇటీవల ఓ టీవీపై చర్చలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయగా.. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అలాగే పలు గల్ఫ్ దేశాల నుంచి తీవ్ర విమర్శలు రాగా.. ఆ తర్వాత బీజేపీ అధిష్ఠానం నుపుర్తో పాటు మరో నేత నవీన్ జిందాల్ను సైతం సస్పెండ్ చేసింది.