Kisan Andolan | యునైటెడ్ కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ మోర్చా ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అస్థి కలష్ యాత్రను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. మద్దతుదారులతో కలిసి శుక్రవారం బటిండా బల్లో గ్రామానికి వెళ్లనున్నారు. ఇక్కడి నుంచి శుభకరన్ అస్థికలతో కూడిన 21 కలశాలను సిద్ధం చేశారు. మొదట శంభు, ఖనౌరీ సరిహద్దులకు తరలించనున్నారు. మార్చి 16 నుంచి హర్యానా నుంచి అస్థి కలష్ యాత్ర ప్రారంభించనున్నారు.
హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ యాత్ర చేపట్టనున్నట్లు రైతు నాయకులు సర్వన్ సింగ్ పంధేర్, జగ్జీత్ సింగ్ దల్వాల్ తెలిపారు. ఈ యాత్ర గ్రామ గ్రామాన సాగుతుందని, ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అంతే కాకుండా తమ డిమాండ్లకు మద్దతుగా ముందుకు వచ్చేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. హర్యానాలో అస్థి కలష్ యాత్ర సందర్భంగా మార్చి 22న హిస్సార్ జిల్లాలోని చారిత్రక ప్రదేశం మజ్రా పియావ్లో, ఆ తర్వాత 31న అంబాలాలోని మౌదా మండిలో నివాళులర్పించడం జరుగుతుందని, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొంటారని రైతు నాయకులు తెలిపారు.