న్యూఢిల్లీ : కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ. 10 లక్షల నుంచి రూ . 20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పేరొందిన న్యాయవాదులు అధిక ఫీజులు గుంజితే దేశంలో పేదలు, అణగారిన వర్గాలకు న్యాయం అందుబాటులో లేకుండా పోతుందని అన్నారు.
జైపూర్లో శనివారం జరిగిన అఖిల భారత న్యాయ సేవల అథారిటీల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సంపన్నులు బడా న్యాయవాదుల పీజులను చెల్లించే స్ధోమత కలిగి ఉంటారని మరి సగటు వ్యక్తి పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో సాధారణ ప్రజలు భరించలేని విధంగా కొందరు న్యాయవాదులు పీజు వసూలు చేస్తారని చెప్పారు.
ఇక ఈ సమావేశంలో పాల్గొన్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బేరసారాలు, ప్రలోభాలతో ప్రభుత్వాలను మార్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత విషమ పరిస్ధితి నెలకొందని, అసలు తన ప్రభుత్వం ఎలా మనగలిగిందనేది తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని కమలనాధుల తీరును ఎండగట్టారు.