తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ రాజద్రోహం నమోదు చేయరాదన్న సుప్రీం వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సుప్రీం కోర్టు చేసిన సూచనలను తాము గౌరవిస్తామని, సుప్రీంకున్న స్వతంత్రతను కూడా అంతే గౌరవిస్తామన్నారు. అయితే.. లక్ష్మణ రేఖ అంటూ ఒకటి ఉంటుందని, దాన్ని దాటకుండా వుంటే బాగుంటుందన్నారు.
తమ అభిప్రాయాలను, ప్రధాని మోదీ అభిప్రాయాలను తాము సుప్రీంకు విన్నవించామని కిరణ్ రిజిజు వెల్లడించారు. సుప్రీం స్వతంత్రతను గౌరవిస్తామని, కానీ.. లక్ష్మణ రేఖ అంటూ ఒకటి ఉంటుందని, దాన్ని అన్ని వ్యవస్థలూ పాటించాలన్నారు. అన్ని వ్యవస్థలూ పరస్పరం గౌరవించుకోవాలన్నారు. అయితే తాము రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను, చట్టాలను గౌరవిస్తున్నామన్న విషయాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని రిజిజు కోరారు.
రాజద్రోహ చట్టంపై సుప్రీం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎలాంటి కేసులూ నమోదు చేయవద్దని ఆదేశించింది. రాజద్రోహ చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు విన్న వించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం వ్యాఖ్యలు చేసింది.