కశ్మీర్: ప్రధాన మంత్రి కార్యాలయం(PMO)లో అధికారిని అంటూ గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి కశ్మీర్(Kashmir)లో టూర్ చేశాడు. కిరణ్ భాయ్ పటేల్(Kiran Bhai Patel) అనే వ్యక్తి తప్పుడు ఐడెంటిటీతో కశ్మీర్ అధికారుల్ని బురుడీకొట్టించాడు. ఓ దశలో అతనికి జెడ్ ప్లస్ సెక్యూర్టీ, బుల్లెట్ ప్రూఫ్ కారు, ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ కల్పించారు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. కిరణ్ భాయ్ ఈ ఏడాదిలోనే రెండు సార్లు కశ్మీర్లో విజిట్ చేశాడు. అక్కడి అధికారులతోనూ అతను మీటింగ్ పెట్టాడు. హల్చల్ చేసిన అతన్ని పట్టుకున్నారు.
పీఎంవోలో ఉన్న స్ట్రాటజీ అండ్ క్యాంపైన్ విభాగానికి(Strategy and Campaign department) చెందిన అడిషనల్ డైరెక్టర్గా కిరణ్ పటేల్ ఫోజులు ఇచ్చాడు. కశ్మీర్ అధికారుల్ని తన తప్పుడు ఐడెంటిటీ(Fake Identity)తో మోసం చేశాడు. అతన్ని పది రోజుల క్రితం అరెస్టు చేశారు. కానీ ఆ అరెస్టును పోలీసులు సీక్రెట్గా ఉంచారు. అయితే మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం గురువారం అతన్ని జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.
పటేల్కు ట్విట్టర్ అకౌంట్ ఉంది. వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ వాఘేలా(BJP General Secretary Vaghela) కూడా ఫాలో అవుతున్నారు. కశ్మీర్లో టూర్ చేసిన వీడియోలను, ఫోటోలను ఆయన పోస్టు చేశారు. ప్యారామిలిటరీ గార్డుల(Paramilitary Guards) సమక్షంలో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసినట్లు బయోడేటాలో ఉంది. ఐఐఎం ట్రిచీలో ఎంబీఏ, కంప్యూటర్ సైన్స్లో ఎం టెక్ చేసినట్లు కూడా ఉంది.
దొంగ ఐడెంటిటీతో ఫిబ్రవరిలో అతను తొలిసారి కశ్మీర్ వ్యాలీలో టూర్ చేశాడు. మొదటిసారి అతను హెల్త్ రిసార్ట్లను(Health Resorts) విజిట్ చేశాడు. బుద్గామ్లో దూద్పత్రి టూరిస్టు కేంద్రాన్ని సందర్శించిన అతను అక్కడ అధికారులతో మీటింగ్ కూడా పెట్టాడు. అయితే కేవలం రెండు వారాల వ్యవధిలోనే అతను రెండోసారి శ్రీనగర్(Srinagar)కు రావడంతో అతని తీరుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. జిల్లా మెజిస్ట్రేట్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అతని రహస్యాలు బయటపడ్డాయి. అతని బ్యాక్గ్రౌండ్ను వెరిఫై చేసిన తర్వాత హోటల్లో అరెస్టు చేశారు. ఆ కాన్మాన్ను విచారించేందుకు గుజరాతీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.