Kiran Bedi | పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై మాజీ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ స్పందించారు. రాష్ట్ర డీజీపీ హాజరు కాకపోవడమే తొలి భద్రతా వైఫల్యమని ఆమె పేర్కొన్నారు. డీజేపీయే కాకుండా హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శి కూడా హాజరు కాలేదని, జిల్లా కలెక్టర్ కూడా గైర్హాజరయ్యారని మండిపడ్డారు. ఇదంతా కూడబలుక్కొని, చేసిన కుట్ర కాదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదంతా కూడా ఓ కుట్రేనని కిరణ్ బేడీ ఆరోపించారు.
పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే వుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పంజాబ్ నుంచి మోదీ ప్రాణాలతో బయటపడ్డారు కానీ, సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేసిన 700 మంది రైతులు మాత్రం క్షేమంగా ఇళ్లకు చేరలేదని ఎద్దేవా చేశారు. నియంత హిట్లర్కు, మోదీకి ఎలాంటి తేడా లేదని డిగ్గీరాజా మండిపడ్డారు.