Ketan Agarwal : మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విచారణలో సియా గోయల్ ఆసక్తికర విషయాలు చెబుతోంది. సియాకు కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే సంగతి తెలిసిందే. ఈ విషయం కేతన్ ఇంట్లో వాళ్లకు లేదా తన ఇంట్లో వాళ్లకు చెప్పినా సరిపోయేది. కానీ, దీని బదులుగా పెళ్లి కొడుకు కేతన్ను చంపాలని నిర్ణయించుకుంది.
దీని ద్వారా తన పెళ్లి ఆగిపోతుందని భావించింది. ఈ అంశంపైనే పోలీసులు ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి సియా ఆసక్తికర సమాధానం చెప్పింది. ఈ పెళ్లికి తాను ఒప్పుకోకపోవడం వల్ల ఇరు కుటుంబాల నుంచి వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడం కన్నా.. కేతన్ అగర్వాల్ను చంపడమే సులభం అని తాను భావించినట్లు చెప్పింది. అందుకే, హత్య చేసినట్లు తెలిపింది. అలాగే, కేతన్ విగ్గు ధరించడం తనకు నచ్చలేదని వెల్లడించింది. కేతన్ హత్యకు తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి చాలా రోజుల ముందు నుంచి ప్లాన్ చేసింది. ఈ హత్యకు చేతన్ చౌదరి ప్రధాన కారకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు రెచ్చగొట్టడం వల్లే ఈ హత్య చేసిందని పోలీసుల అంచనా. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. కేతన్ను చంపిన తర్వాత మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదని ఆమెతోపాటు ప్రియుడు చేతన్ నిర్ణయించుకున్నట్లు తేలింది. సియా, చేతన్ మధ్య గత ఏడాది దీపావళి నుంచే బంధం ఏర్పడింది.
కేతన్తో ఎంగేజ్మెంట్కు కొద్ది రోజుల ముందు జనవరిలో చేతన్, సియా కలిసి రాజస్థాన్లోని కొన్ని పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఏకాంతంగా గడిపారు. ఐదు రోజులపాటు కలిసే ఉన్నారు. ఈ అంశాలన్నీ విచారణలో తేలాయి. మరోవైపు కేతన్ మృతదేహం దొరికిన తర్వాత అతడికి తీవ్ర గాయాలైనప్పటికీ సియాలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో కేతన్ మృతదేహంపై చాలా గాయాలు కనిపించినప్పటికీ.. సియా మాత్రం పెద్దగా స్పందించలేదని చెప్పారు.