న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సీనియర్ నాయకులు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్లు పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ హెడ్క్వార్టర్స్, ఏఐసీసీ కార్యాలయంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని పార్టీ హెడ్ క్వార్టర్స్లో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ డెలిగేట్స్ ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లలో ఓటు వేయాలని పార్టీ ఎన్నికల సంఘం సూచించింది. పోలింగ్ రోజు ఎవరైనా రాష్ట్రాల నాయకులు ఎవరైనా ఢిల్లీలో ఉండాల్సి వస్తే.. ఎన్నికల అథారిటీ ముందస్తు అనుమతితో సెంట్రల్ హెడ్ క్వార్టర్స్లో ఓటు వేయవచ్చని తెలిపింది. ఇక భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్గాంధీ, అతని వెంబడి ఉన్న సుమారు 40 మంది డెలిగేట్స్ కోసం బళ్లారిలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ఇక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమతమ రాష్ట్రాల్లోని హెడ్క్వార్టర్స్లోనే ఓటు వేయనున్నారు. మల్లిఖార్జున్ ఖర్గే బెంగళూరులో, శశిథరూర్ త్రివేండ్రంలో తమ ఓట్లు వేస్తారు. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, దాదాపు 22 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పట్లో సీనియర్ నేత జితేంద్ర ప్రసాద్.. సోనియాగాంధీపై పోటీచేసి ఓడిపోయారు.
137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవి కోసం పోటీ జరగడం ఇది ఆరోసారి మాత్రమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇవి రెండోసారి జరుగుతున్న ఎన్నికలు. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా సోనియాగాంధీ ఘనత దక్కించుకున్నారు. ఆమె 20 ఏండ్లకు పైగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నారు. 1998 నుంచి 2017 వరకు, తిరిగి 2019 నుంచి ఇప్పటివరకు సోనియా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు.