న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రోజువారీ జీవితంలో ఆర్థిక అంశాలు కీలకం. అలాంటప్పుడు నిత్యం వస్తున్న ఆర్థికాంశాల మార్పులను తెలుసుకోవాలి. లేకుంటే కొత్త సమస్యలు వస్తాయి. సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, గ్యాస్, బీమా రంగాల్లో వచ్చిన మార్పులివే..
1. ఆగస్టు 1 తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీ రిటర్న్స్) దాఖలు చేసిన వారు వెంటనే ఈ-వెరిఫైని పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ గడువును 30 రోజులకు తగ్గించారు. గతంలో ఈ గడువు 120 రోజులుగా ఉండేది. అయితే జూలై 31కి ముందు ఐటీ రిటర్న్స్ను దాఖలు చేసిన వారికి మాత్రం వెరిఫికేషన్కు 120 రోజుల సమయం ఉంటుంది.
2. ఈ నెల నుంచి డెబిట్ కార్డు జారీ చార్జీలు, వార్షిక రుసుములను పెంచుతున్నట్టు పలు బ్యాంకులు ప్రకటించాయి. కార్డుల్లో ఉపయోగించే సెమీ కండక్టర్ చిప్ల ధరలు పెరుగడమే ఇందుకు కారణమని వెల్లడించాయి.
3. పీవోఎస్, యాప్లలో నిక్షిప్తమై ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఈ నెలలోనే టోకెన్స్ రూపంలోకి మార్చుకోండి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి కార్డు టోకనైజేషన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. కాబట్టి మీ వివరాలను టోకెన్లతో రీప్లేస్ చేసుకోవడానికి ఆయా యాప్లలో మీ అనుమతి తెలియజేయాలి.
4. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి ఇదే చివరి అవకాశం. అక్టోబర్ 1 నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ స్కీమ్కు అనర్హులని కేంద్రం ప్రకటించింది. అంతకంటే ముందు చేరినవారు మాత్రం కొనసాగుతారు. అంటే ఈ స్కీమ్లో చేరడానికి ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు ఉన్నది.
5. జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పెన్షన్ జమకు డైరెక్ట్ రెమిట్ మార్గాన్ని ఎంపిక చేసుకుంటే పీవోపీలకు లభించే కమీషన్ను 0.10 శాతం నుంచి 0.20 శాతానికి పెంచారు. ఈ మార్పు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నది.
6. ప్రతి నెల మొదటివారంలో గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడమో, తగ్గించడమో జరుగుతుంది. ఈ సారి కూడా ఈ ఆనవాయితీ కొనసాగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ. 91.5 తగ్గించారు. దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 1,885కు తగ్గింది.
7. బీమా ఏజెంట్లకు ఇచ్చే కమీషన్లో మార్పులు రానున్నాయి.
8. ఆడీ కార్ల ధరలను పెంచాలని తయారీ కంపెనీ నిర్ణయించింది. ముడి వస్తువుల ధరలు పెరుగడమే ఇందుకు కారణమని చెప్తున్నది.