Encounter : పశ్చిమబెంగాల్ (west Bengal) లోని బరుయ్పుర్ (Baruipur) లో 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్యచేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడు బుధవారం తెల్లవారుజామున పోలీసుల ఎన్కౌంటర్ (Encounter) లో మృతిచెందాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ (Seen reconstruction) కోసం అతడిని తీసుకెళ్లగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఓ పోలీసు వద్ద ఉన్న తుపాకీ లాక్కొని పారిపోవడానికి యత్నించడమే కాకుండా.. ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడని పేర్కొన్నారు.
దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా అతడికి బుల్లెట్ గాయాలయ్యాయని వెల్లడించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో అతడు ప్రధాన నిందితుల్లో ఒకడని, బాలిక అదృశ్యమయ్యే ముందు ఆమెతో కలిసి ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు చెప్పారు. హత్యాచార ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. బాలిక మృతదేహం లభించిన కొద్ది గంటల్లోనే అనుమానంతో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టిచంపారు.
ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. మరోవైపు ఈ ఘటనపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి డీజీపీని ఆదేశించారు.