న్యూఢిల్లీ, జూలై 4: పురుషుల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలన్న తన పిలుపును బీజేపీ రాజ్యసభ సభ్యుడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ మిట్టల్ పునరుద్ఘాటించారు. 26 ఏండ్ల కేతన్ అగర్వాల్ను హత్య చేశారన్న ఆరోపణలపై ఆయన కాబోయే భార్య, ఆమె స్నేహితుడిని అరెస్టు చేసిన పుణె కేసును ఉటంకిస్తూ మిట్టల్ తన పిలుపును పునరుద్ఘాటించారు. ఈ కేసు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని శనివారం పేర్కొన్న మిట్టల్ జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తరహాలో పురుషులకు అటువంటి కమిషన్ ఏర్పాటు కోసం తాను ప్రైవేట్ సభ్యుని బిల్లును ప్రవేశపెట్టినప్పటి 2025 డిసెంబర్ నాటి రాజ్యసభ కార్యకలాపాల వీడియోను ఆయన షేర్ చేశారు. పంజాబ్ నుంచి ఎన్నికైన మిట్టల్ అప్పట్లో ఆప్లో ఉండేవారు. బీజేపీలో విలీనం అయినట్లు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించిన రాఘవ్ చద్దా నేతృత్వంలోని ఏడుగురు ఆప్ ఎంపీల బృందంలో మిట్టల్ కూడా ఉన్నారు. పురుషులు కూడా బాధితులు అవుతారనడానికి కేతన్ కేసు ఒక హెచ్చరికని ఎక్స్ పోస్ట్లో మిట్టల్ పేర్కొన్నారు. సంస్థాగత మద్దతుకు, చట్టపరమైన రక్షణకు, తమ గళం వినిపించే వేదికకు పురుషులు కూడా అర్హులు. లింగ భేదం లేకుండా న్యాయం అందరికీ సమానంగా ఉండాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి ప్రైవేట్ బిల్లులు కనీసం ఓటింగ్ దశకు కూడా చేరవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి 14 బిల్లులు మాత్రమే చట్టంగా మారాయి. 1970 నుండి పార్లమెంట్ ఉభయ సభలలో ఏ ఒక్కటీ ఆమోదం పొందలేదు. నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్లు, 2025 రాజ్యసభ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. 2025 డిసెంబర్ 5న ప్రవేశపెట్టినట్లు దీని స్టేటస్ రాసి ఉంది.
పురుషుల హక్కులు: ఈ బిల్లు పురుషుల హక్కులు, సంక్షేమాన్ని పరిరక్షించడానికి, ఫిర్యాదులను నివారించడానికి పురుషుల కోసం ఒక జాతీయ కమిషన్ను ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తున్నది. పురుషులను ప్రభావితం చేసే ప్రస్తుత చట్టాలు, విధానాలను సమీక్షించగల ఒక శాసనబద్ధమైన వ్యవస్థ ఏర్పడటంతో పాటు పురుషుల శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సును ప్రభావితం చేసే సమస్యలపై నివారణా ప్రచారాన్ని ప్రోత్సహించడం కూడా ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం